సినీ రంగానికి దూరం అవ్వాలని నిర్ణయించుకున్న ర‌కుల్ ప్రీత్

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న రకుల్ ప్రీత్

ర‌కుల్ ప్రీత్ సింగ్ వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి చిన్న సినిమాతో వెలుగులోకి వ‌చ్చిన ఈ ఢిల్లీ భామ‌.. చూస్తుండ‌గానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో జ‌ట్టు క‌ట్టేసింది. ఒక ద‌శ‌లో నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కూడా కైవ‌సం చేసుకుంది. కానీ దాన్ని ఎంతో కాలం నిల‌బెట్టుకోలేక‌పోయింది.

వ‌రుస ఫ్లాపులు ఆమెను కిందికి లాగేశాయి. వేగంగా ఫేడ‌వుట్ అయిపోయి ఇప్పుడు అవ‌కాశాలే లేని ప‌రిస్థితికి చేరుకుంది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మ‌న్మ‌థుడు-2 నిరాశ‌ను మిగ‌ల్చ‌డమే కాదు.. ర‌కుల్‌కు చెడ్డ పేరు కూడా తెచ్చిపెట్టింది. దీని త‌ర్వాత టాలీవుడ్లో ర‌కుల్ కెరీర్ దాదాపు క్లోజ్ అయిన‌ట్లే ఉంది.

త‌మిళంలో భార‌తీయుడు-2 లాంటి పెద్ద సినిమా చేతిలో ఉన్నా ర‌కుల్ సంతృప్తిగా ఉన్న‌ట్లు లేదు. ఇప్పుడు త‌న‌కు తానుగా అవ‌కాశాలు వ‌ద్ద‌నుకుని కొంత కాలం విరామం తీసుకోవాల‌ని భావిస్తుండ‌టం విశేషం. స్వ‌యంగా ర‌కుల్ చెన్నైలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఈ మాట చెప్ప‌డం గ‌మ‌నార్హం. తమిళంలోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తగ్గించా.

కావాలని కొన్ని అవకాశాలను వదులుకున్నా. ఎంతగా కష్టపడుతున్నా ఇటీవల సరైన ఫలితాలు రావడం లేదు. వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. అందుకే కొంతకాలం సినీ రంగానికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నా. భ‌విష్య‌త్తులో మంచి కథ, నచ్చిన పాత్ర అయితేనే సినిమాలు అంగీకరిస్తాను అని ర‌కుల్ స్ప‌ష్టం చేసింది.