ప్రపం‍చ దేశాల నేతలకు స్టార్‌ క్రికెటర్‌ విజ్ఞప్తి

ప్రపం‍చ దేశాల నేతలకు స్టార్‌ క్రికెటర్‌ విజ్ఞప్తి

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి యూఎస్, నాటో దళాలు వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశం మొత్తం రావణకాష్టంలా రగులుతోంది. గత నెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌లలో తాలిబన్లు పౌరులపై జరిపిన దాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 1న అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రదాడులు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని దాదాపు 400 జిల్లాలో సగానికి పైగా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగష్టు 31 లోపు అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపం‍చ దేశాల నేతలకు ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ రషీద్ ఖాన్ ఓ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచ నేతలంతా ఏకమై తన దేశాన్ని రక్షించి, శాంతిని స్థాపించాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించాడు. ‘నా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ వేలాది మంది అమాయకులు, పిల్లలు, మహిళలు అమరులవుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో పడేయవద్దు. మాకు శాంతి కావాలి’ అంటూ ట్విటర్‌లో తన ఆవేదనను పంచుకున్నాడు.