ఇండియన్ సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా బాహుబలిను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ తర్వాత సినిమా విషయంలో సిల్లీ కష్టాలను ఎదుర్కొంటోంది. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేనిలు తమ తర్వాత సినిమాను శర్వానంద్ హీరోగా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా వారు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలోనే క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒక ధీరుడు’ మరియు ‘సైజ్ జీరో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దర్శకుడిగా ప్రకాష్ అన్ ఫిట్ అని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే శర్వానంద్ పర్వాలేదులే అని సాహస నిర్ణయం తీసుకున్నాడు. బాహుబలి ప్రొడక్షన్ హౌస్ అనే పేరుతో సినిమా ఆడుతుందని భావించాడు. కాని తాజాగా శర్వానంద్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు.
ప్రకాష్ దర్శకత్వంలో చేసేందుకు శర్వాకు ధైర్యం సరిపోవడం లేదని, అందుకే సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం బాహుబలి నిర్మాతలు మరో హీరోను వెదికే పనిలో పడ్డారు. బాహుబలి వంటి అంతర్జాతీయ స్థాయి సినిమాను నిర్మించిన నిర్మాతలు ఇలాంటి సిల్లీ కారణాలు ఎదుర్కోవడం అందరికి ఆశ్చర్యకరంగా ఉంది. ప్రస్తుతం ప్రకాష్ స్క్రిప్ట్ను మరింత పర్ఫెక్ట్కు మలిచేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక యువ హీరోతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.