త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాను

త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాను

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌కు ముందు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ధావ‌న్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్,నవదీప్ సైనీకి కూడా పాజిటివ్‌గా నిర్ధ‌ణైంది. దీంతో వ‌న్డే జ‌ట్టులోకి మయాంక్ అగర్వాల్‌, ఇష‌న్ కిష‌న్‌కు పిలుపునిచ్చారు. కాగా క‌రోనా బారిన ప‌డిన త‌ర్వాత తొలి సారి ధావ‌న్ స్పందించాడు. త‌ను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు ధావ‌న్ ధన్యవాదాలు తెలిపాడు.

“నాపై మీ ప్రేమ‌, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను. త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాను” అని ధావ‌న్ ట్విట‌ర్‌లో పేర్కొన్నాడు. కాగా ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డేల్లో పున‌రాగ‌మ‌నం చేసిన ధావ‌న్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఇక స్వదేశంలో వెస్టిండీస్‌తో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20 లు ఆడ‌నుంది. ఇక అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 6న తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది.