ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌ ని ఏ నిముషానయినా అరెస్ట్ చేసే అవకాశం !

Telangana Police Gave Look out Notices To IT Grid Chairman

తెలుగుదేశం పార్టీకి చెందిన ‘సేవా మిత్ర’ యాప్ కోసం ఆంధ్రప్రదేశ్ ఓటర్ల డేటాను చోరీ చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేసి తెలంగాణా పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ సర్వర్ల నుంచి ఏపీ ఓటర్ల జాబితాతో పాటు ఆధార్ వివరాలను కూడా చోరీ చేశారని టీడీపీపై వైసీపీ నేతలు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పై మాదాపూర్, ఎస్.ఆర్.నగర్ పోలీసులు సంయుక్త దర్యాప్తు జరుపుతున్నారు.

హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో నాలుగురోజులుగా సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఐటీ గ్రిడ్ కార్యాలయంలో కంప్యూటర్ల నుంచి డాటాను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. బెంగళూరుకు చెందిన హ్యాకర్స్ ద్వారా డాటాను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెనుదుమారం రేపుతోంది. టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు, ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌ మీద సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అలెర్ట్ చేశారు. అలాగే దేశం విడిచి పారిపోకుండా అశోక్‌పై పోలీసులు ఎల్‌వోసీ జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అశోక్‌కు పోలీసులు నోటీసులు పంపారు. తమ ముందు లొంగిపోయి దర్యాప్తునకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ అశోక్ పరారీలోనే ఉన్నారు. తమ ముందు దర్యాప్తునకు హాజరుకావడానికి పోలీసులు ఇచ్చిన సమయం మంగళవారంతో పూర్తవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అశోక్‌ను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.