ప్రకాశం జిల్లా పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒంగోలులో మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలిశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిల భేటీ కలకలం రేపుతోంది. నిన్న ఒంగోలులోని బృందావన్ గార్డెన్లో పవన్ను శ్రీనివాసులరెడ్డి కలిశారు. ఈ కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనివాసుల రెడ్డి జనసేనలో చేరతారని.. ఆ పార్టీ తరుపున ఎంపీ లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటికే జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్లి పవన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవి కుటుంబంతో శ్రీనివాసులరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని..
ఈ కారణంగానే ఆయన పవన్ను కలిశారని అనుచరులు చెబుతున్నారు. తాజాగా పవన్తో భేటీపై మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పందించారు. జనసేన అధినేత పవన్ తనకు మంచి స్నేహితుడని.. సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. వ్యక్తిగతంగానే ఆయన్ను కలిశానని.. రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పవన్తో భేటీపై మీడియా ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చారు శ్రీనివాసులు రెడ్డి.