పొలంలోంచి ఎత్తుకెళ్లిన మహిళను 13రోజులు నరకం చూపారు…ఆపై

దిశ వంటి చట్టాలు ఎంత కఠినంగా చేసి ఆచరణాత్మకంగా కేసులలో ఉరి శిక్షలు వేస్తున్నా ప్రజలు మాత్రం ఏమాత్రం మారడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుపుతూనే ఉన్నారు. మహిళలు అర్థరాత్రి రోడ్డుపై ఒంటరిగా నడవలేకపోతున్నారు. అంతెందుకు పగలు కూడా ప్రశాంతంగా తిరగలేని పరిస్థితి నెలకొంది. పగటిపూట పొలంలో పని చేసుకుంటున్న మహిళను అపహరించి గ్యాంగ్‌ రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు సుమారు రెండు వారాల పాటు నిర్బంధించి నరకం చూపారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.

అయితే రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. పదమూడు రోజులు ఆమెను బంధించి నానా రకాలుగా నరకం చూపారు. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడి బీభత్సం చేశారు. కామాంధుల చెర నుంచి మెల్లిగా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్బంధించి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ నెల 15 వరకూ నిందితులు తనను బంధించి గ్యాంగ్ రేప్ చేశారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.