ఏపీలోని నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన విజయనగరం పట్టణంలో తాజాగా జరిగింది. విజయనగరం పట్టణ సమీపంలోని పెద్ద చెరువు వద్ద ఊటగుమ్మిలోని గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారు యాగటి జయరాం (15), బొత్స నాని (12), బొత్స దివాకర్(8)గా గుర్తించారు. పెద్దచెరువుకు కిందనున్న మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో ఈ మధ్య రోడ్డు కోసం గుంతలు తీశారు.

ఈ గుంతల్లో భారీగా నీరు చేరడంతో స్నానం కోసమని వెళ్లిన వీరు అక్కడే మృత్యువుకు బలైపోయారు. కాగా మొత్తం 8 మంది చిన్నారులు స్నానానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురికి ఈత రావడంతో సురక్షితంగా బయట పడ్డారు. మిగతా ముగ్గురికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. కాగా ఒకేసారి ముగ్గురు చిన్నారులు మరణించారని తెలియడంతో విజయనగరం పట్టణంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా దుఃఖించారు. దీంతో చుట్టుపక్కల వారికి ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది.