పొన్నూరు వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాజకీయ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీకి చెందిన వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరులో వెలుగు చూసింది. బాధితుడు తెలిపినట్లుగా.. పోలీసులు వెల్లడించిన వివరాలు చూసుకుంటే.. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన సూర బ్రహ్మయ్యపై ఏడో వార్డుకు చెందిన బాణాల దుర్గారావు కత్తితో దాడిచేశాడు. కత్తి కడుపులో బలంగా దిగటంతో తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బ్రహ్మయ్య టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చాడు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు చాలా మందిని తనతో పాటు పార్టీలోకి తీసుకురావటంతో బ్రహ్మయ్యతో దుర్గారావు గొడవ పడ్డాడు. తాజాగా తన ఇంటి వద్ద దుర్గారావు, మరో వ్యక్తితో గొడవ పడుతుండగా.. వారికి బ్రహ్మయ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో కోపానికి గురైన దుర్గారావు ఇంట్లోకెళ్లి కత్తి తెచ్చి బ్రహ్మయ్యపై దాడి చేశాడు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే దుర్గారావు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా బాధితుడు, అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు.