అతి వేగం ప్రాణాలకు ప్రమాదం

అతి వేగం ప్రాణాలకు ప్రమాదం

మితిమీరిన వేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. పని కోసం వెళ్తున్న ఓ తాపీమేస్త్రీ, వేరే దగ్గర ఉంటున్న కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్తున్న బృందంలో ఓ మహిళ గమ్యస్థానాలకు చేరకుండానే మృత్యువాత పడ్డారు. నర్సీపట్నం–తుని ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఆటో,బైక్‌ ఢీకొన్న ప్రమాదం లో  ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో గునుపూడి గ్రామానికి చెందిన గిడుతూరు దుర్గాప్రసాద్, పలకా సతీష్‌ అనే ఇద్దరు తాపీమేస్త్రీలు  నర్సీపట్నంలో పనిచేయడానికి  బుధవారం ఉదయం బైక్‌ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్, నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న ఆటో మండలంలో యం.బెన్నవరం   సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జి.దుర్గాప్రసాద్‌ (23) అక్కడికక్కడే మృతి చెందగా, బైక్‌పై వెనుక  కూర్చొన్న పలకా సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి.  ఆటోలో ప్రయాణిస్తున్న  రోలుగుంట మండలం  బుచ్చెంపేట గ్రామానికి చెందిన ద్వారంపూడి వరలక్ష్మి(45) అనే మహిళ రోడ్డుపైకి తుళ్లిపోయి, తీవ్రంగా గాయపడి అక్కడక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్, మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.