జగన్ పార్టీలోకి ఉండవల్లి…మంత్రి పదవి కూడా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ వైసీపీలో చేరబోతున్నారని, పార్టీలో ఉండవల్లి వంటి సీనియర్ నేతలు ఉండాలని జగన్ భావిస్తున్నారట ఆయనే స్వయంగా అరుణ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారట. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వస్తే ఈ మాజీ ఎంపీకి మంత్రివర్గంలో అవకాశం కూడా కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చేశారట. కొద్దిరోజులుగా ఉండవల్లిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీలో చేరిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. తాను వైసీపీ చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. వైసీపీలో చాలామంది సీనియర్ నేతలు, అనుభవజ్ఞ‌ులు, ఉన్నారంటున్నారు అరుణ్‌కుమార్. సోషల్ మీడియాలో ఏవేవో పెడుతుంటారు వాటిని నమ్మొద్దంటున్నారు. తాను రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని.. కంపల్సరీ రిటైర్మెంట్ కాదన్నారు. కంపల్సరీ రిటైర్మెంట్ అంటే పనిష్మెంట్ వాలంటరీ రిటైర్మెంట్ అంటే సింపుల్‌గా తనకు నచ్చిన పని చేస్తున్నానని అన్నారు. ఉండవల్లి అరుణ కుమార్ రాజకీయాల్లో తలపండిన నేత. అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు. అంతేకాకుండా జగన్ తండ్రి వైఎస్ఆర్‌కు ఎంతో ఆప్తుడు. ఎలాంటి విషయమైనా ముక్కు సూటిగా మొహమోటం లేకుండా చెప్పేస్తారు ఉండవల్లి. అనేక రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో ఆయనను మించిన వారు ఉండరు. అయితే ఏపీ విభజన తర్వాత మాత్రం ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన పార్టీలో ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు ఉంటే పార్టీకి కూడా ఎంతో మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే తన మంత్రివర్గంలో చేరాలని జగన్ ఉండవల్లిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జగన్ ఆహ్వానానికి అటు ఉండవల్లి కూడా సూత్రప్రాయంగా ఓకే అన్నట్లు సమాచారం.