దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై (Varanasi) అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంచుకున్న ఈ సినిమా ఏకంగా 50 భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రతి భాషలోనూ నటీనటుల భావోద్వేగాలు, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు సహజంగా అనిపించాలన్నదే రాజమౌళి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకే డబ్బింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పూర్తిగా ఆధారపడకుండా రియల్ వాయిస్ ఆర్టిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 మంది డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్లను పరిశీలించి, ప్రతి భాషకు పాత్రలకు సరిపోయే కళాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులకు భాష మారినా పాత్రల భావోద్వేగాల్లో ఎలాంటి తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
తెలుగు, హిందీ, తమిళం వంటి భారతీయ భాషలతో పాటు జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ తదితర అంతర్జాతీయ భాషల్లోనూ ‘వారణాసి’ని విడుదల చేయనున్నారు. దీంతో భారతీయ సినిమాను మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ సినిమా నిలవనుంది.
భారీ తారాగణం, గ్రాండ్ విజువల్స్, రాజమౌళి మార్క్ మేకింగ్తో పాటు ఇంత పెద్ద సంఖ్యలో భాషల్లో విడుదల కానుండటంతో ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. మరి ఈ పాన్-వరల్డ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.






