లాభాల్లో దూసుకుపోతున్న జోమాటో

లాభాల్లో దూసుకుపోతున్న జోమాటో

మార్కెట్ లో జొమాటో కొనుగోళ్ల విందు చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజీ (ఎన్ఎస్ఈ)లో 53 శాతం ప్రీమియంతో ఒక్కో షేరు ధర రూ.116గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన కొద్దిసేపటికే షేర్ ధర 62 శాతం పెరిగింది. ఒకానొక దశలో రూ.138ని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసినట్టయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి రూ, 126 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.

బాంబే స్టాక్ ఎక్స్ చేంజీ (బీఎస్ఈ)లో 51 శాతం ప్రీమియంతో రూ.115గా లిస్ట్ లో చేరింది. ఈ కంపెనీ షేర్ వాస్తవ ఐపీవో ధర రూ.76. అయితే, 50 శాతం అదనపు ధరతో లిస్ట్ కావడం విశేషం. 2020 తర్వాత 50 శాతం అదనపు ప్రీమియంతో లిస్ట్ అయిన 10 కంపెనీల జాబితాలో జొమాటో చేరింది. బీఎస్ఈలో అత్యధిక విలువ కలిగిన 50 సంస్థల సరసన చేరింది. అదే జోరులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలనూ వెనక్కి నెట్టింది.

ప్రస్తుతం మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతుండటం జోమాటోకు కలిసివచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు ఐపీవో లిస్టింగ్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. లాభాలు మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ.. పెట్టుబడుల్లో స్థిరత్వమే జొమాటో విషయంలో సానుకూల ధోరణికి కారణమై ఉంటుందని విళ్లేషకులు అంటున్నారు.