బెజవాడలో జగన్ మేనియా…కటౌట్లతో అలంకరణ

jagan mania in bejawada

వైసీపీ అధినేత జగన్ రేపు వ్ద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం మొత్తం జగన్ ప్లెక్సీలు, పోస్టర్లతో నిండిపోయింది. తాజాగా విజయవాడలోని కనకదుర్గ వారధి వద్ద  ఏకంగా 70 అడుగులు ఉన్న జగన్ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బొమ్మలతో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. భారీ ఆకారంలో ఉన్న ఈ కటౌట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలువురికి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబును, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఆహ్వానించిన ఆయన, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సురవరం, సీతారాం ఏచూరి, కన్నా లక్ష్మీనారాయణ, చిరంజీవి, వామపక్ష నేతలు మధు, రామకృష్ణలకు ఫోన్ చేశారు. అలాగే కుటుంబ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావుకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. తాజాగా పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మల్లాడి స్వయంగా వెల్లడించారు. తనకు జగన్ ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ప్రమాణస్వీకారానికి వెళ్తున్నానని చెప్పారు.