రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు మాయం

రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు మాయం

ఒకవైపు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంటే మరోవైపు కేటుగాళ్లు రెచ్చి పోయారు. అదను చూసి తమ పని కానిచ్చేశారు. ముంబై వ్యాపారవేత్తకు చెందిన ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దోచు కొనిపోయారు. ఈ భారీ చోరీ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గురువారం జరిగింది. విషయం తెలిసి వ్యాపారవేత్త కుటుంబం ఒక్కసారిగా షాక్‌ అయింది.

వివరాలను పరిశీలిస్తే ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ భాటియా కుమార్తె వివాహ వేడుక జైపూర్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్ క్లార్క్స్ అమెర్‌లో ఘనంగా జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా భాటియా, ఇతర కుటుంబ సభ్యులు ఏడో అంతస్తులో బస చేశారు. కింద లాన్‌లో సంగీత్‌ వేడుక జరుగుతోంది. అంతా ఆ హడావిడిలో ఉండగా అదును చూసిన దుండగులు రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్‌, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామని, సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అపహరించినట్లు పోలీసులు రాధారామన్ గుప్తా శుక్రవారం తెలిపారు. హోటల్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం జరిగిందని రాహుల్ భాటియా తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో హోటల్ మేనేజ్‌ మెంట్, ఇతర సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వధువు తరపు బంధువులే ఈ పనిచేసి ఉంటారని హోటల్‌ యాజమాన్యం చెబుతోంది.