తమిళ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన కుటుంబ సభ్యులు పెద్దగా ప్రజల ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రాత్మకమైన విప్లవమని జాసన్ సంజయ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘సిగ్మా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “మా నాన్న ముఖ్యమంత్రి కావడం సమాజంలో వచ్చిన గొప్ప మార్పుకు నిదర్శనం. ఆయన సీఎం అయిన తర్వాత నా బాధ్యతలు కూడా మరింత పెరిగాయి. మా కుటుంబం ఆయన వారసత్వాన్ని గౌరవంగా కొనసాగించాల్సిన బాధ్యత మాపై ఉంది” అని తెలిపారు.
అలాగే, తాను సినీ పరిశ్రమలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు విజయ్ తనకు ఇచ్చిన సలహా గురించి కూడా జాసన్ వెల్లడించారు. “సొంతంగా నాకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలని, ఎవరి అండపై కాకుండా నా కష్టంతోనే ఎదగాలని మా నాన్న చెప్పారు. ఎంత కష్టమైనా నా కాళ్లపై నేనే నిలబడాలని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించారు” అంటూ జాసన్ సంజయ్ చెప్పుకొచ్చారు.


