తమిళ నటుడు విశాల్, విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవల ఆయనను కలిసినట్లు ఓ ఇంటర్వ్యూలో విశాల్ వెల్లడించారు. సీఎం అయినప్పటికీ విజయ్ (Thalapathy Vijay) ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదని, గతంలో మాదిరిగానే ఎంతో సాధారణంగా తనతో మాట్లాడారని తెలిపారు.
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పలువురు ప్రముఖులు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారని విశాల్ గుర్తుచేశారు. తమిళనాడులో శివాజీ గణేషన్, భాగ్యరాజ్ వంటి ప్రముఖ నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారని అన్నారు. అదే విధంగా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి వంటి వారికి భారీ సినీ ఇమేజ్ ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో రాజకీయ మార్పును తీసుకురాలేకపోయారని విశ్లేషించారు.
ప్రజల్లో మార్పు కోరిక.. విజయ్పై నమ్మకం
విజయ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని విశాల్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఓ సినీ హీరో రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాదని, ప్రజల్లో మార్పు కోసం ఉన్న బలమైన ఆకాంక్ష కూడా విజయ్కు కలిసి వచ్చిందని అన్నారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేసే యువతతో పాటు సామాన్య ప్రజలు విజయ్ మాట్లాడే విధానానికి బాగా కనెక్ట్ అయ్యారని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున విజయ్ చేసిన ప్రసంగం ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని విశాల్ తెలిపారు. ముఖ్యంగా “మీ తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దలకు ఒక్కసారి నాకు ఓటేయమని చెప్పండి” అంటూ విజయ్ చేసిన విజ్ఞప్తి ప్రజల మనసులను తాకిందని అన్నారు.
ఓ రిటైర్డ్ జడ్జి తన మనవరాలు చెప్పడంతో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)కు ఓటు వేసినట్లు చెప్పడం కూడా విజయ్ ప్రభావానికి ఉదాహరణగా విశాల్ పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే విధానం, మార్పు కోసం ఉన్న ఆకాంక్ష, యువత మద్దతు విజయ్ రాజకీయ విజయానికి కీలక కారణాలుగా ఆయన విశ్లేషించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మకుటం’ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.






