
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస పరాజయాల తర్వాత తన సినిమాల బిజినెస్ మోడల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కోసం రవితేజ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని, లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ను నిర్మించే బాధ్యతలను దిల్ రాజుతో గతంలో భాగస్వామిగా ఉన్న లక్ష్మణ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు రవితేజ త్వరలోనే దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో నటించనున్న కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ రాబోయే సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.





