ముంబైలో కోట్ల రూపాయల మోసం

ముంబైలో కోట్ల రూపాయల మోసం

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు. అందులో గజేంద్ర ఫారెక్ అనే వ్యాపారవేత్త కూడా ఉన్నాడు.ఈ నేపథ్యంలోనే తాజాగా ముంబై పోలీసులకు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్ చిక్కాడు.

ఆటోమొబైల్ రంగంలో మోసాలకు పాల్పడ్డ గజేంద్ర.. ముంబైలో కోట్ల రూపాయల మోసం చేసినట్లు తెలుస్తోంది.. ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా గజేంద్ర ఉన్నట్లు సమాచారం.. ఈ క్రమంలో గజేంద్రను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ డ్రగ్స్ కేసులో గజేంద్ర నిందితుడిగా ఉండడంతో.. గజేంద్రను పట్టుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు..ఈ క్రమంలోనే కోర్టులో పీటీ వారెంట్ వేసి గజేంద్రను హైదరాబాద్‌కు పోలీసులు తీసుకొని రానున్నట్లు సమాచారం. గజేంద్రతో పాటు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ముగ్గురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నట్లు తెలిసింది..