Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న 102వ చిత్రం ‘జైసింహా’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 2017 సంక్రాంతిని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో విజయవంతం చేసుకున్న బాలయ్య 2018 సంక్రాంతికి ‘జైసింహా’తో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాడు. సంక్రాంతికి ఇప్పటికే ‘రంగస్థలం’ మరియు ‘అజ్ఞాతవాసి’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి అంటూ ప్రకటన వచ్చింది. ఈ మూడు సినిమాలతో మరో సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అదే అనుష్క ‘భాగమతి’.
‘పిల్లజమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భాగమతి’ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అనుష్క ద్విపాత్రాభినయం చేయడంతో పాటు, కథ చాలా విభిన్నంగా ఉంటుందని, సోషియో ఫాంటసీ కథ అంటూ చెప్పడం వల్ల ‘భాగమతి’ని చూడాలని ప్రేక్షకు ఉవ్విల్లూరుతున్నారు. కాని ఏదో కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. ఎట్టకేలకు సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. మొన్నటి వరకు డిసెంబర్లో విడుదల చేయాలని భావించిన అఖిల్ రెండవ సినిమా ‘హలో’ క్రిస్మస్కు విడుదల చేయబోతున్నారు. అందుకే డిసెంబర్లో కాకుండా జనవరిలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.
‘భాగమతి’ చిత్రాన్ని ప్రభాస్ సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్లు యూవీ క్రియేషన్స్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని, అనుష్క కెరీర్లో మరో ‘అరుంధతి’ అవుతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. అనుష్క రెండు పాత్రాల్లో పూర్తి విభిన్నంగా ఇప్పటి వరకు కనిపించని విధంగా ఈ చిత్రంలో కనిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది. అనుష్క ‘భాగమతి’ కోసం చాలా కష్టపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్లు ప్లాన్ చేస్తున్నారు.