బెట్టింగ్ సైట్ల ఫేవరెట్ భారతే

betting sites favourite india

ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో భారత్ ఫేవరెట్ అనే విషయాన్ని విశ్లేషకులు, క్రీడా పండితులే కాదు.. బెట్టింగ్ రాయుళ్లు కూడా ఒప్పేసుకుంటున్నారు. మంగళవారం కివీస్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే విజయం సాధిస్తుందని.. అంతేకాదు, ఫైనల్లో నెగ్గి జగజ్జేతగా నిలుస్తుందని ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లు నిర్ధారించేశాయి. లాడ్‌బ్రోకర్స్, బెట్‌వే వంటి వెబ్‌సైట్లు… లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌లో భారత్ గెలిచి కప్పును ముద్దాడుతుందని అంచనా వేస్తున్నాయి. విజేతగా టీమ్‌ఇండియా నిలుస్తుందని లాడ్‌బ్రోకర్స్ బెట్టింగ్‌ను 13/8గా నిర్ణయిస్తే… ఇంగ్లండ్(15/8), ఆస్ట్రేలియా(11/4), న్యూజిలాండ్(8/1) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉదాహరణకు.. ఈ సైట్‌లో భారత్ గెలుస్తుందని బెట్ వేసిన వ్యక్తి అంచనా నిజమైతే పందెం కట్టిన మొత్తాన్ని 13ఇంతలు చేసి.. 8తో భాగించగా వచ్చిన సొమ్ము(రూ.100కు 162)ను ఇస్తారు. ఒకవేళ న్యూజిలాండ్ తరఫున బెట్ కట్టి అదే జట్టు గెలిస్తే పందెం వేసిన మొత్తాన్ని 8రెట్లు చేసి 1తో భాగించగా వచ్చిన సొమ్ము(రూ.100కు 800)ను ఇస్తారు. ఇక బెట్‌వే కూడా భారత్‌కే ఓటేస్తూ.. 2.8తో మొదటిస్థానాన్ని కట్టబెట్టగా ఇంగ్లండ్(3), ఆస్ట్రేలియా(3.8), న్యూజిలాండ్(9.5) ఆ తర్వాత ఉన్నాయి. దీనిప్రకారం భారత్ టైటిల్ గెలిస్తే ఆ జట్టు తరఫున పందెం కట్టిన వ్యక్తి.. వెచ్చించిన మొత్తానికి 2.8 రెట్లు పొందుతాడు. ఇదే న్యూజిలాండ్ తరఫున వేసి ఆ జట్టు గెలిస్తే ఏకంగా 9.5రెట్ల మొత్తాన్ని కైవసం చేసుకుంటాడు. అలాగే ఆటగాళ్ల విషయంలోనూ బ్యాట్స్‌మెన్ ఫేవరెట్‌గా టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఉండగా.. ఆ తర్వాత వార్నర్, రూట్ ఉన్నారు.