Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక రాజకీయ సంరంభం ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను కొనేసి కాంగ్రెస్ ని మరలా బకరాని చేద్దామని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, కింగ్ మేకర్ నుంచి కింగ్ గా మారిన కుమార స్వామి… కాంగ్రెస్ అధిష్టానం కలిసి బీజేపీ ఎత్తులకు పై ఎత్తు వేయడంతో కాషాయవాదులే బకరా అయిన పరిస్థితి ఏర్పడింది. కర్నాటక ఎన్నికల ఫలితాలు విడుదల అయిన నాటి నుండి అందరూ ఆ సీట్ల లెక్కలు గురించే మాట్లాడుకుంటున్నారు కానీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభలో బీజేపీపై పడిన సంగతిని చాలామంది గమనించి ఉండరు. లోక్ సభలో బీజేపీ ఎంపీల మెజారిటీ 270కు తగ్గింది మొత్తం 544 మంది సభ్యులుండే లోక్ సభలో సగానికి ఒకటి ఎక్కువగా అంటే 273 మంది బలముంటే సాధారణ మెజారిటీ ఉన్నట్టు. దేశవ్యాప్తంగా మరో ఏడు సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలను బట్టి బీజేపీ మైనారిటీలో పడబోతోందన్న విషయం ఇప్పుడు కాషాయ నాదులని కలవరపెట్టే అంశం.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 544 ఎంపీ స్థానాలకు గానూ 285 ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ 30 సంవత్సరాల తర్వాత పూర్తి మెజారిటీ ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. దీనికితోడు శివసేన సహా కొన్ని పార్టీలు మోదీ సర్కార్ కు మద్దతివ్వడంతో బీజేపీ బలం మరింత పెరిగింది. అయితే, 2018 ప్రారంభం నాటికి బీజేపీ సీన్ మారిపోయింది. 2018 మొదట్లో బీజేపీకి లోక్ సభలో 274 మంది ఎంపీల మద్దతుంది. ఆ పార్టీ రెబెల్స్ శత్రుఘ్న సిన్హా, కీర్తి ఆజాద్ లను లెక్కలోనుంచి తీసేస్తే ఆ సంఖ్య 272కు తగ్గుతుంది. తాజాగా యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా చేయడంతో ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ బలం 270కు తగ్గింది.
కర్నాటక రాష్ట్రంలో బీజేపీ ఎంపీలయిన యడ్యూరప్ప, శ్రీరాములు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా ఉంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో బల పరీక్షలో పాల్గొనే అవకాశం ఉండదు. ఇదే సమయంలో సీఎంగానూ ప్రమాణ స్వీకారం కుదరదు. దీంతో యడ్యూరప్ప, శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే వాటిని ఆమోదించినట్టు కూడా మీడియాకి లీకులు వచ్చాయి (స్పీకర్ కార్యాలయం నుండి అధికారిక ప్రకటన లేదు). దీంతో వెంటనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బల పరీక్ష అయితే జరగలేదుగానీ, యడ్యూరప్ప సీఎం పదవిని పోగొట్టుకున్నారు. ఈ వ్యవహారం బీజేపీని దింపేందుకు కాంగ్రెస్ తదితర విపక్షాలకు మరో బ్రహ్మస్త్రహం దొరికినట్టే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎందుకంటే ఇప్పటికే మోదీ మీద ఎంపీల్లో వ్యతిరేకత ఉంది. శతృఘ్నసిన్హా వంటి అసంతృప్తులతో పాటు రిజర్వ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎంపీలు కూడా మోదీకి వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నారు. 2014 తర్వాత బీజేపీ బలం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. వివిధ కారణాల వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2014 నుంచి ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 10 సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఇప్పుడు శ్రీరాములు, యడ్యూరప్ప రాజీనామాలను ఆమోదిస్తే సభలో బీజేపీ బలం 272 మాత్రమే అవుతుంది. ఆమోదించకుంటే, ఇప్పటికే అభాసు పాలు అవుతున్న బీజేపీ మరింతగా ప్రజల ముందు తల దించుకునే పరిస్థితి. ఎన్డీఏ మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా ఉంటే బీజేపీకి ఒక్క సీటు తగ్గినా సాంకేతికంగా ప్రభుత్వం మైనారిటీలో ఉన్నట్లే లెక్క. అందుకే వారి రాజీనామాలపై పునరాలోచన చేస్తోంది.
కర్ణాటక ఎంపీల రాజీనామాలను ఆమోదించడం లేదని చెబితే, బీజేపీకి, ఇంత కంటే పరువు తక్కువ వ్యవహారం మరొకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఎటొచ్చీ, మోదీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే, ఎన్డీయేలోని అకాలీ దళ్, లోక్ జనశక్తి, జేడీయూ వంటి ఇతర పార్టీల సభ్యులు 12 మంది వరకు వున్నారు. ఆ పక్షాలని కూడా కాంగ్రెస్ కనుక రాజాకీయ చతురత ఉపయోగించి తమ వైపు తిప్పుకుంటే మోడీ సర్కారు మీద అవిశ్వాసం పెట్టి దెబ్బ తీసే అవకాశలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.