Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ కొత్త బిరుదు ఇచ్చింది. ఇన్నాళ్లూ రాహుల్ ను పప్పు అని సంబోధించే బీజేపీ… ఎన్నికల సంఘం ఆ పదాన్ని నిషేధించిండంతో కొత్త పేరుతో పిలవడం మొదలుపెట్టింది. గుజరాత్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీని యువరాజ్ అని సంబోధిస్తూ వీడియో విడుదల చేసింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ… రాహుల్ ను పప్పు అని సంబోధిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో పప్పు స్థానంలో యువరాజ్ అని ఎడిట్ చేసింది. రాహుల్ ను యువరాజ్ గా పిలుస్తూ తాజాగా బీజేపీ విడుదల చేసిన 48 సెకండ్ల వీడియో నెట్ లో వైరల్ గా మారింది.
ఓ సరుకుల దుకాణంలో యజమాని… అతడి కూలీ మధ్య జరుగుతున్న సంభాషణ ఈ వీడియోలో ఉంటుంది. దుకాణంలోకి యువరాజ్ వస్తున్నాడు అని అక్కడ పనిచేసే వ్యక్తి అంటాడు. దీంతో దుకాణుదారుడు యువరాజును ఉద్దేశించి నువ్వు ఏమైనా కొనొచ్చు గానీ… మా ఓట్లను మాత్రం కొనలేవు అని చెబుతాడు. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబరు 9,14 తేదీల్లో రెండు విడతలుగా గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశాబ్దాల నుంచి గుజరాత్ లో వరుసగా గెలుపొందుతూ వస్తున్న బీజేపీ… ఈ ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తోంది. అయితే మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత గుజరాత్ ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ఈసారి ఎలాగైనా గుజరాత్ లో గెలుపొందాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ గుజరాత్ అంతా కలియతిరుగుతూ విస్తృతప్రచారం నిర్వహిస్తున్నారు. మరి గుజరాత్ ఓటర్తు ఈ సారీ బీజేపీకే పట్టం కడతారా లేక కాంగ్రెస్ వెంట నిలుస్తారా అన్నది డిసెంబరు 18న తేలనుంది.