సాక్షి పత్రిక సరళి,సంగతి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏళ్ల తరబడి అందరూ చూస్తున్న విషయమే. అయితే అలా అలవాటు పడిపోయిన వాళ్లకి ఈ రోజు నెట్ లో సాక్షి చూడగానే షాక్. నవ్వుతూ చంద్రబాబు పెద్ద ఫోటో కనిపించింది. నిరుద్యోగ భృతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన తాలూకా ఫోటో ఇది. వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి మున్ముందు ఏపీ సర్కార్ భారీ స్థాయిలో ప్రకటనలు గుప్పించాలని చూస్తోంది. అదే జరిగితే సాక్షి కి ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి రీత్యా ప్రభుత్వ ప్రకటనలు కాదనే వాతావరణం లేదు. ఔనంటే డబ్బులు వస్తాయేమో గానీ ….పత్రికలో బాబుని ఏకేస్తూ , ప్రకటనల రూపంలో ఆయనకు భజన చేస్తే ఎదురు అయ్యే పరిణామాలు ఏంటో తెలియనివి కావు. ఈ రోజు సాక్షి పత్రిక చూడగానే చాలా మంది వైసీపీ అభిమానుల్లో తలెత్తిన సందేహాలు ఇవి. అలాంటిది వైసీపీ ని , సాక్షిని నడిపిస్తున్న పెద్దలకు ఈ విషయాలు తెలియకుండా ఉంటాయా ? అయినా ఇలాగే సాక్షి కొనసాగుతుందా ? ఈ ప్రశ్నలకు సాక్షి యాజమాన్యం తీసుకోబోయే నిర్ణయమే సమాధానం చెబుతుంది.
ఇక ప్రకటనల రూపంలో జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు సాక్షి ఎడిటోరియల్ టీం ఇంకో ప్రయోగం చేసింది. సహజంగా బ్యానర్ ఐటెం కి జగన్ యాత్ర లేదా ఏదో స్టేట్ మెంట్ ని హైలైట్ చేసే సాక్షి ఈ రోజు అందుకు భిన్నంగా ట్రై చేసింది. బాబ్లీ కేసుకి సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు అంశం మీద ప్రతికూల కధనం ఇచ్చింది. సహజమైన విషయాన్ని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆ కధనం సారాంశం. ఆ కధనం విషయంలో నిజానిజాలు పక్కనబెడితే సాక్షి వల్ల చంద్రబాబుకి డబల్ బెనిఫిట్ కనిపిస్తోంది. ఒకటి ప్రకటన రూపంలో , ఇంకోటి కధనం రూపంలో మొదటి పేజీ నిండా చంద్రబాబుకి ప్రాధాన్యం ఇవ్వడమే ఆ బెనిఫిట్. ఈ దృశ్యం కాస్త అరుదే. సాక్షి మున్ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తుందా లేక ఏదైనా కౌంటర్ వ్యూహం తో ముందుకు వస్తోందో చూడాలి.