చత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల మరో హింసాకాండ…!

Chhattisgarh Bsf Personnel Killed In Ied Blast In Bijapur Ahead Of Polls

శాసనసభ ఎన్నికలు జరుగుతున్నవేళ చత్తీస్‌గఢ్ లో మరోసారి మావోయిస్టులు హింసాకాండ కొనసాగించారు. చత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్నికలకు భద్రత దళాలుగా వ్యవహరిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఈ దారుణకాండకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక బీఎస్ఎఫ్‌ జవాను మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయపడిన ఆరుగురిలో నలుగురు జవాన్లు, ఒక డీఆర్జీ మరియు ఒక సాధారణ పౌరుడు ఉన్నారని సమాచారం. వీరిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.

bsf

ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ నవంబర్ 12 న జరిగింది. ఈ రాష్ట్రంలోని మావోయిస్టులు అధికంగా ఉండే 18 నియోజకవర్గాల్లోనే ఈ తొలి విడత పోలింగ్ నిర్వహించారు. బీజాపూర్ లో జరిగిన ఎన్నికల విధులకు హాజరయ్యి తిరిగి వెళ్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతర తో పేల్చివేశారు. ఈ బీజాపూర్ లోనే కాకుండా బస్తర్, దంతెవాడ, సుక్మా, రాజానందగావ్, కాంకేర్ జిల్లాలలోని ప్రాంతాలలో కూడా భారీగా సాయుధ దళాలను మోహరించి, భారీ భద్రత నడుమ పోలింగ్ నిర్వహించారు.

maoists

ఎన్నికల ప్రారంభం కి ముందు ప్రజలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని, చేతివేలి పై సిరా చుక్క కనిపిస్తే ఆ చేతి వేలితో పాటు, చేతులని కూడా నరుకుతామని మావోయిస్టులు బెదిరించినా, ప్రజలు ఆ బెదిరింపులకు లొంగకుండా భారీ ఎత్తున ముందుకొచ్చి తమ ఓటు హక్కు ని వినియోగించుకున్నారు. దంతెవాడ జిల్లాలో గల మాదేండ గ్రామంలో 263 మంది ప్రజలు ఓటు హక్కు ని వినియోగించుకున్నారు. మరో 72 నియోజకవర్గాలకు ఈ నెల 20 న రెండో దశ ఎన్నికలు జరిపి, డిసెంబర్ 11 న ఎన్నికల ఫలితాలు విడుదలచేస్తారు.

polling