కేరళకు కేసీఆర్…స్వకార్యంతో పాటు స్వామికార్యం

కేరళ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. నిన్న తిరువనంతపురం విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ అక్కడ నుంచి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతపద్మనాభ స్వామి ఆలయ అధికారులు కేసీఆర్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా తిరువనంతపురానికి వెళ్లిన కేసీఆర్‌ కేరళ సీఎం పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. కేరళ పర్యటన అనంతరం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామితో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.