విపక్షాలకు సుప్రీం షాక్…పిటిషన్ తిరస్కరణ!

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కిన విపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈవీఎంలతో పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పలతో సరిపోల్చాలన్న కాంగ్రెస్, టీడీపీ సహా 22 విపక్షాలు విపక్షాల వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ అంశంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం తమకు లేదని సుప్రీం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ విషయంలో వాదనలను వినడానికి కూడా సుప్రీం నిరాకరించింది. 50 శాతం కాకపోయినా కనీసం 25 శాతం వీవీప్యాట్ స్లిప్పులైనా లెక్కించాలని కోరగా, దీనిని కూడా ధర్మాసనం తిరస్కరించింది. వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలని ప్రతిపక్షాలు గత డిసెంబరులోనే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ యంత్రాలను ర్యాండమ్‌గా లెక్కించాలని ఈసీని ఆదేశించింది. అయితే దీనిపై సంతృప్తి చెందని విపక్షాలు ఈ సంఖ్యను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ మరోసారి సుప్రీం గడపతొక్కాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కాసేపటికే వాదనలు వినడానికి ధర్మాసనం నిరాకరించింది. కాగా, వీవీప్యాట్లలో 50శాతం స్లిప్పులను లెక్కించాలంటే ఫలితాలు వెలువడేందుకు సమయం ఎక్కువగా తీసుకోవడంతో పాటు సిబ్బంది కూడా ఎక్కువ అవుతారని ఎన్నికల సంఘం ఏప్రిల్ 8న జరిగిన వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపింది.