దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్కును దాటాయి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు అమెరికా తరువాత భారత్‌లో నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,00,04,599 మందికి కరోనా వైరస్ సోకింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 11,71,868 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 27వేల మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరో 342 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసులు కోటి దాటినా గడచిన కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

యాక్టివ్ కేసుల్లోనూ రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 3,07,079 యాక్టివ్ కేసులుండగా.. ఆ రేటు 3.09శాతానికి చేరింది. 95,49,923 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు కూడా 95 శాతంపైనే ఉంది. గత వారం రోజులుగా మరణాల సంఖ్య 400 దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో 347 మంది మరణించగా..మొత్తం మరణాల సంఖ్య 1,45,171కి చేరింది.

ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. డిసెంబరు 18 నాటికి కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 16 కోట్లు దాటింది. దేశంలో జనవరి 30న తొలి కరోనా కేసు కేరళలో నమోదుకాగా.. 325 రోజుల్లో పాజిటివ్ కేసులు కోటికి చేరుకున్నాయి. కరోనా వైరస్ విషయంలో మిగతా దేశాల కంటే భారత్ ముందే అప్రమత్తమయ్యింది. ముందుగానే లాక్‌డౌన్ విధించడంతో మహమ్మారి అదుపులో ఉంది. మరోవైపు, టీకాకు అనుమతి లభిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కేంద్రం కూడా కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

కరోనా నుంచి సంపూర్ణ రక్షణ లభించాలంటే.. రెండు డోసులతో కూడిన వ్యాక్సిన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేయాలి. మొదటి డోసు అందించిన 28 రోజుల తర్వాత రెండో డోసును వేస్తారు. రెండో డోసు వేసుకున్న రెండు వారాల తర్వాత వ్యాక్సిన్‌ రోగ నిరోధకత, యాంటీబాడీల విడుదల మొదలవుతుంది. కరోనా పాజిటివ్‌ ఉండగా వ్యాక్సిన్‌ వేయించుకోవద్దు. ఇన్ఫెక్షన్‌ ఉన్నవారు వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళితే.. అక్కడ వైరస్‌ వ్యాప్తి జరిగే ముప్పు పొంచి ఉంటుంది. కొవిడ్‌-19 లక్షణాలు బయటపడిన 14 రోజుల తర్వాతే వ్యాక్సినేషన్‌ గురించి ఆలోచించాలి.