భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (Pradeep Rawat) కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం సుమారు 5:30 గంటలకు ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. తీవ్ర గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భారతీయ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.
తెలుగులో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంతో ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో పోషించిన ‘భిక్షు యాదవ్’ పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం ‘ఛత్రపతి’ లో రాజ్ బిహారీ, ‘గజిని’ లో ప్రధాన ప్రతినాయకుడిగా తన శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అంతేకాకుండా భద్ర, దేశముదురు, స్టాలిన్, ఓయ్, నేను శైలజ వంటి పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ప్రదీప్ రావత్ ఆకస్మిక మరణ వార్త సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

