మాట నిలబెట్టుకున్నా

మాట నిలబెట్టుకున్నా

సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేసే దీపక్‌.. బ్యాటింగ్‌ చేయడంలోనూ సత్తా చాటగలడు. ఇప్పటివరకు టీమిండియా తరపున ఏడు వన్డేలు ఆడిన చహర్‌ 179 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉండడం విశేషం. ఇక బౌలింగ్‌లో 10 వికెట్లు తీసిన చహర్‌ మంచి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో తాను బ్యాటింగ్‌లో రాణించడం వెనుక ఎంఎస్‌ ధోని సలహా ఎంతో ఉపయోగపడిందంటూ చహర్‌ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో గత సీజన్‌లో దుమ్మురేపే ప్రదర్శన చేసిన చహర్‌ సీఎస్‌కే టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్‌ మెగావేలంలో సీఎస్‌కే రూ. 14 కోట్లు పెట్టి చహర్‌ను మరోసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా స్పోర్ట్స్‌ యారీ య్యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చహర్‌ మాట్లాడాడు. ”ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజునే మేమిద్దరం మాట్లాడుకున్నాం.

ఆరోజు ధోని భయ్యా ఒక విషయం చెప్పాడు. ”బౌలింగ్‌లో ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్నావు.. కానీ నీ బ్యాటింగ్‌ పవరేంటో చూపించలేదు. ఇకపై బ్యాటింగ్‌పై కూడా ఫోకస్‌ పెట్టు.. దాని గురించి ఆలోచించు” అని చెప్పాడు. తక్షణమే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌పై దృష్టి సారించా. అందుకోసం చాలా హార్డ్‌వర్క్‌ చేశా. ఆ తర్వాత గతేడాది శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 82 బంతుల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడడం ఎప్పటికి మరిచిపోను. ఆరోజు ధోని చెప్పిన మాట నిలబెట్టుకున్నా.”అంటూ పేర్కొన్నాడు.

కాగా ఇటీవల విండీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌లో కండరాల గాయంతో మూడో టి20కి చహర్‌ దూరమయ్యాడు. రానున్న శ్రీలంకతో టి20 సిరీస్‌కు దీపక్‌ చహర్‌ అందుబాటులో ఉండేది అనుమానమే. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్‌ ఆరంభ దశలోనూ సీఎస్‌కే చహర్‌ సేవలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా టి20ల్లో పవర్‌ప్లేలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీపర్‌ చహర్‌ నిలిచాడు.