ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు

ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు

ఏడాది కిందట అక్కినేని నాగార్జున.. తమిళ నటుడు ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ భారీ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించడం.. ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలవడం తెలిసిన సంగతే. ఐతే ఆ సినిమాకు అనుకోకుండా బ్రేక్ పడింది.

ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు వేసుకోగా.. నిర్మాణ సంస్థకు ఆర్థిక సమస్యలు తలెత్తి వెనక్కి తగ్గింది. దీంతో సినిమా ఆగిపోయింది. దీంతో ధనుష్ ఈ సినిమాను పక్కన పెట్టేసి హీరోగా చేస్తున్న సినిమాల మీదే దృష్టిపెట్టాడు. ‘రుద్ర’ పేరుతో తెరకెక్కాల్సిన ఆ సినిమా చరిత్రలో కలిసిపోయిందనే అనుకున్నారంతా. కానీ ధనుష్ ఆ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఆ స్క్రిప్టు మీద పని చేసి.. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. వేరే నిర్మాతల్ని ఒప్పించి సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు.

షూటింగ్స్ పున:ప్రారంభమై సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ‘రుద్ర’ చిత్రాన్ని ధనుష్ పున:ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ముందు అతను హీరోగా నటిస్తున్న ‘కర్ణన్’ అనే సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘జగమే తంత్రం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘రుద్ర’ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా. దీని కాస్టింగ్ పెద్దదే. నాగ్‌తో పాటు అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, ఎస్జే సూర్య, శరత్ కుమార్, అను ఇమ్మాన్యుయెల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

నాగ్ చేయాల్సిన పాత్రకు ముందు రజనీకాంత్‌ను అనుకున్నాడు ధనుష్. ఆయన ఈ సినిమా చేసే అవకాశం లేకపోవడంతో నాగ్ వైపు చూశాడు. ఇంతకుముందు ధనుష్ ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా చక్కటి విజయం సాధించింది. ఈసారి ధనుష్ పెద్ద ప్రాజెక్టునే తలకెత్తుకున్నాడు.