బావి లో పడి యువతి మృతి…కొద్ది రోజుల్లోనే పెళ్లి

బావి లో పడి యువతి మృతి...కొద్ది రోజుల్లోనే పెళ్లి

కొద్ది రోజుల క్రితం వారిద్దరికీ నిశ్చితార్థమైంది. వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయించారు. ఎంగేజ్‌మెంట్ అయ్యింది కాబట్టి వారిద్దరూ కలిసి సరదాగా బైక్ మీద బయటకు వెళ్లారు. ఓ పొలంలో బావి దగ్గర ఆగి సెల్ఫీలు దిగారు. బావి మెట్ల మీద నిలబడి సెల్ఫీలు దిగే క్రమంలో యువతి పట్టుతప్పి బావిలో పడగా ఆమెను కాపాడే ప్రయత్నంలో యువకుడు కూడా బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా యువకుడు క్షేమంగా బయటపడ్డాడు.

చెన్నై సమీపంలోని పట్టాభిరామ్‌లోని గాంధీ నగర్‌కి చెందిన మెర్సీ స్టెప్పీ అనే యువతికి అదే ఊళ్లోని నవజీవన్ నగర్‌కు చెందిన అప్పు అనే యువకుడితో కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థమైంది. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది.

సోమవారం మెర్సీ ఇంటికి వెళ్లిన అప్పు  బైక్ మీద బయటకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వాళ్లిద్దరూ వండలూరు ప్రాంతంలో ఉన్న ఓ పొలం వద్దకు వెళ్లారు. అక్కడున్న మెట్ల బావిని చూసిన మెర్సీ బైక్ ఆపమని కాబోయే భర్తను కోరింది.

కొన్ని సెల్ఫీలు దిగాక వాళ్లిద్దరూ బావిలో కట్టిన మెట్ల మీదకు వెళ్లారు. మెట్టు అంచున నిలబడి ఫొటో తీసే క్రమంలో మెర్సీ కాలు జారింది. దీంతో తల గోడకు గుద్దుకున్న అనంతరం ఆమె బావిలో పడిపోయింది. మెర్సీని కాపాడే క్రమంలో అప్పు కూడా బ్యాలెన్స్ తప్పి బావిలో పడిపోయాడు. సాయం కోసం అప్పు కేకలు వేయగా గమనించిన ఓ రైతు నీళ్లలోకి దూకి అతణ్ని కాపాడాడు. కానీ మెర్సీ మాత్రం నీటిలో మునిగిపోయింది. రెస్క్యూ టీంకు సమాచారం అందించగా వారొచ్చి ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపారు. అప్పును ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.