ఒకేఒక్కడు…2000 మందిని కాపాడేశాడు

Father And Daughter Saved 2000 People from Major Train Accident AT Tripura

నిత్యం మనం ఎదో ఒక ప్రమాదం జరగడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రమాదానికి గురైన వారిని కొందరు. వైద్యశాలలకు తీసుకెళ్లటం, వారిని కాపాడటం చూస్తుంటాం. అలాగే మరికొంతమంది ప్రమాదాలు జరిగినా తమకేమీ పట్టనట్టుగా నిర్లక్షంగా వెళ్లిపోవటం గమనిస్తున్నాం. చదువుకున్నవాళ్లే అత్యధికంగా మనకెందుకులే అని వెళ్లి పోతుండటం చూస్తున్నాం. కానీ అటవీ ప్రాంతంలో ఏమీ తెలియని, బీదరికంలో మగ్గుతున్న కాగితాలు ఏరుకునే వ్యక్తి ఒక రైలు ప్రమాదాన్ని ముందే పసిగట్టి రెండు వేలమందిని కాపాడాడు. ఆతని కుమార్తె కూడా తండ్రికి సహకరించింది.

వివరాల్లోకి వెళితే. త్రిపురాలోని ధలాయ్ జిల్లా దంచార గ్రామానికి చెందిన స్వపన్ దిబ్బార్మ అనే వ్యక్తి.. రైల్వేట్రాక్‌ వెంబడి సేకరించిన చిత్తుకాగితాలు, ప్లాస్టిక్‌ బాటిళ్లనూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగానే ఆ రోజు కూడా పనికోసం, తన చిన్నారి కూతురుతో కలిసి రైల్వేట్రాక్ మీదకి వచ్చాడు. అలా ముందుకు నడుస్తూ… దొరికిన ప్లాస్టిక్‌ బాటిళ్లను, చేతికి తగిలించుకున్న సంచిలో వేసుకుంటున్నాడు. ఇంతలో ఓ దృశ్యాన్ని చూసి సడన్‌గా ఆగిపోయాడు.

ఎదురుగా విరిగి ఉన్న రైలు పట్టా చూసి షాక్ తిన్నాడు. ఇంతలో అక్కడికి కొద్ది దూరంలోనే ఒక రైలు కూత వేసుకుంటూ.. విరిగిన రైలు పట్టావైపు వస్తోంది. రైలు ఇంతవరకూ వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో తనకి అర్ధం అయ్యింది. ఎవరికైనా చెబుదామంటే చుట్టూ ఎవరూ లేరు. అలా అని చెప్పే టైము కూడా లేదు. ఎలాగోలా తనే ధైర్యం చేశాడు. కూతురిని పక్కనే ఉండమని చెప్పి, తను మాత్రం రైలు పట్టాల మధ్యలో నిలబడ్డాడు. తనపాప వేసుకున్న చొక్కా (అది వారు చొక్కా గా భావించే ఒక చిల్లులు పడ్డ గుడ్డ)ను తిప్పుతూ… రైలుని ఆపమని డ్రైవర్‌కి సైగ చేశాడు. ఎలాంటి స్పందన లేదు. తన చొక్కానూ విప్పి, రెండింటిని కలిపి ఊపుతూ పెద్దగా కేకలేసాడు. ఈ సారి కూడా ఎలాంటి మార్పూ లేదు.

ఇక లాభం లేదనుకుని, ఒకసారి తన కూతురు మొహం వైపు చూసి… రైలుకు ఎదురుగా, కేకలు వేస్తూ, చొక్కాలు తిప్పుతూ పరిగెత్తాడు. ఈసారి మాత్రం డ్రైవర్‌ తనను గమనించాడు. అయితే… ఆ రైలుకు స్పీడ్‌ బ్రేకులు లేవు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ నార్మల్ బ్రేకులు వేసాడు. రైలు క్రమక్రమంగా వేగం తగ్గుతూ రావడంతో… తన దగ్గరకు రాగానే వెంటనే స్వపన్‌ పక్కకి తప్పుకున్నాడు. అదృష్టావశాత్తూ… ఆ రైలు పట్టాలు విరిగిన స్థలానికి, కొన్ని గజాల ముందు వరకూ వచ్చి ఆగిపోయింది.

ఏ స్టేషనూ లేనిచోట రైలు ఆగడంతో, ఎంతోమంది ప్రయాణికులు అసహనంతో రైలు దిగారు. కారణం తెలుసుకుని విస్తుపోయి, దిబ్బార్మకు కృతజ్ఞతలు చెప్పారు. కొందరు సెల్ఫీలు దిగారు. ఆ సమయంలో రైలులో దాదాపు 2000 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఆనోటా ఈనోటా విషయం తెలుసుకున్న త్రిపుర మినిస్టర్ రాయ్ బర్మన్… ఈ తండ్రీకూతుళ్లను… అతని అధికార నివాసానికి పిలిపించి… ఇద్దరికీ మంచి బట్టలు కొనిపెట్టి వీఐపీలు డిన్నర్ చేసే చోట వారితో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా త్రిపుర అసెంబ్లీ వీరిని అభినందించి, వీరు సౌకర్యంగా బ్రతికేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగదు బహుమతి ప్రకటించనుంది. వీరికి త్రిపుర ప్రభుత్వం కూడా అవార్డు ప్రకటించనుంది. దేశంలోని ప్రముఖులందరు ఇప్పుడు వీరిద్దరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.