ఐదుగురు ఉగ్రవాదులు హతం

ఐదుగురు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ కమాండర్‌ అఫాక్‌ సికందర్‌ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లా పాంబే, గోపాల్‌పొరాలో బుధవారం భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ముష్కరులు మరణించారు.

గోపాల్‌పొరాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు భద్రతా అధికారులపై కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ ట్వీట్‌ చేశారు. వారిలో ఒకరు నిషేధిత టీఆర్‌ఎఫ్‌కు చెందిన కమాండర్‌ సికందర్‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇక పాంబే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.