భాగ్యనగరం రోడ్లపైకి భారీగా వరదనీరు

భాగ్యనగరం రోడ్లపైకి భారీగా వరదనీరు

భారీ వర్షానికి భాగ్యనగరం మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువానకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 7గంటల నుంచి చిరుజల్లులుగా మొదలై 15నిమిషాల్లోనే దాదాపు 3.5సెంటీమీటర్ల వర్షం నగరవ్యాప్తంగా కురిసింది. గురువారం నగరంలో ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినా.. ఊహించని రీతిలో అతి భారీ వర్షం ముంచెత్తింది.

అయితే ముందస్తు హెచ్చరికలతో బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, షేక్‌పేట, నాంపల్లి, లక్డీకాపూల్‌ ప్రాంతాల్లో విరిగిపడ్డ చెట్లను బల్దియా సిబ్బంది తొలగించారు. నగరం నైరుతి వైపున ఉరుములు మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.గురువారం రాత్రి 7.30-10.30 గం. మధ్య సుమారు 10 సెం.మీ. వర్షం పడటంతో ఊహించని నష్టం వాటిల్లింది. కాలనీలు, రహదారులు నదులను తలపించాయి.

రోడ్లన్నీ మునిగిపోయాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు పడవల్లా తేలాయి. మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, శ్రీనగర్‌కాలనీ, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. అమీర్‌పేట మైత్రివనం వద్ద కార్లు నీట మునిగాయి. మూసాపేట, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. నిజాంపేట, మియాపూర్‌, బోరబండ, అల్లాపూర్‌ డివిజన్‌ వివేకానందనగర్‌ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.

కృష్ణానగర్‌లో తోపుడుబండ్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని జీహెచ్ఎంసీ సిబ్బంది కాపాడారు. ట్రాఫిక్‌ సమస్య రాత్రి 11 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. ఎల్బీనగర్‌ నుంచి బయల్దేరిన వాహనాలు కూకట్‌పల్లి చేరుకునేందుకు రెండున్నర గంటలు పట్టింది. జూబ్లీహిల్స్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రాంతంలో అత్యధికంగా 9.78 సెం.మీ. వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్తు సరఫరా వ్యవస్థపై దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి అత్యవసరంగా ఆడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందుబాటులో ఉన్న సీజీఎం, ఎస్‌ఈలతో పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా వినియోగదారులు 1912/100/స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ ఆఫీసుతో పాటు విద్యుత్ కంట్రోల్‌ రూమ్‌ల నంబర్లు 7382072104/106/1574కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని సీఎండీ సూచించారు.