అవిశ్వాసం : కేంద్రాన్ని నిట్టనిలువునా ఎన్ కౌంటర్ చేసిన గల్లా

Galla Jayadev Speech in Parliament over No Confidence Motion

పార్లమెంటు ఉభయసభలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై లోక్‌సభలో ఈరోజు చర్చకు వచ్చింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాసంపై చర్చను తన ప్రసంగంతో ప్రారంభించారు. ముందుగా అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన గల్లా పార్లమెంట్‌ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మాపై కక్ష గట్టారని ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని గల్లా చెప్పుకొచ్చారు.
గల్లా స్పీచ్ హై లైట్స్

  • అవిశ్వాసం అనేది బీజేపీ-టీడీపీ మధ్య వార్ కాదని మెజారిటీ-మొరాలిటీ మధ్య జరుగుతున్న యుద్ధమని గల్లా వ్యాఖ్యానించారు.
  • ఇచ్చిన హామీలను నిలుపుకోలోలేని కేంద్రంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నన్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో విరుచుకుపడ్డారు.
  • తమ రాష్ట్రంలో ధర్మపోరాటానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండాల్సిన పారదర్శక సంబంధాలను మోదీ తీవ్రంగా దెబ్బతీశారని జయదేవ్ ఆరోపించారు.
  • నాలుగు కారణాలతో తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని పేర్కొన్న ఆయన, పారదర్శకత, నమ్మకం, ప్రాధాన్యత, మాట నిలబెట్టుకోవడం అన్న అంశాలపై తమకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని ఉద్ఘాటించారు.
  • రాష్ట్ర విభజన పారదర్శకంగా జరగలేదని, న్యాయం చేసే విషయంలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారని, నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదని దుయ్యబట్టారు.
  • పలు విభజన హామీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. తాను 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల తరఫున మాట్లాడుతున్నానని అన్నారు.
  • తెలంగాణలో ఉన్న ఎన్నో విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలున్నాయి.. పాత పేరుతో కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్‌లో అవి లేవని చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, నిర్దయగా విభజించారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆ
    సమయంలో కాంగ్రెస్ సభ్యులు జయదేవ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్పీకర్ వారించారు. అలాగే టీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ఎంపీలకు మద్దతు పలకడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.
  • టీడీపీకి ఇచ్చిన సమయం అయిపోయిన నేపధ్యంలో స్పీకర్ సుమిత్రామహాజన్ కలగజేసుకుని ఇంకా ఎంతసేపు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇంకెంత సమయం కావాలని అడిగారు. దీనికి సమాధానంగా, ఇది చాలా కీలకమైన సమావేశమని, తాము చెప్పుకోవాల్సింది చాలా ఉందని, అన్నీ వివరించడానికి తనకు మరో గంట కేటాయించాలని అన్నారు. అంత సమయం ఇవ్వడం కుదరదు ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇస్తానని స్పీకర్ చెప్పారు.
  • దీనికి సమాధానంగా, అవిశ్వాసంపై తీర్మానానికి సంబంధించి గంట కన్నా తక్కువ సయమంలో తమ సమస్యలను చెప్పుకోవడం కుదరదని గల్లా సమాధానం చెప్పారు. గతంలో అవిశ్వాసంపై చర్చ జరిగినప్పుడు గంట కంటే తక్కువగా ఎవరూ చర్చ జరపలేదని, తాను రికార్డులను పరిశీలించే మాట్లాడుతున్నానని గల్లా చెప్పారు. హిస్టరీ గురించి మాట్లాడటం కాదని.. వర్తమానం గురించి మాట్లాడండని గల్లాకు స్పీకర్ చెప్పారు.
  • ‘భరత్ అనే నేను’ మూవీ స్టోరీని గల్లా పార్లమెంట్‌లో ప్రస్తావించారు.