రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధులుగా హరివంశ్(జేడీయూ) బీకే హరిప్రసాద్(కాంగ్రెస్) బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు జరిగిన ఎన్నికలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే కూటమి బలపరిచిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. నేటి ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు చైర్మన్ వెంకయ్యనాయుడు. ఆ తరువాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించిన ఆయన మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్ కావాలని గొడవ చేయడంతో ఓటింగ్ నిర్వహించారు.
ఇందులో హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 89 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 222 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదని కౌంటింగ్ నంబర్ బోర్డు తెలిపింది. ఆపై దీంతో హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని వెంకయ్య నాయుడు ప్రకటించారు. అయితే కొంతమంది సభ్యులు తాము పొరపాటు పడ్డామని, మరికొందరు ఓటు వేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసారి వోటింగ్ పెట్టారు అప్పుడు హరివంశ్ కు 122 ఓట్లు, హరిప్రసాద్ కు 98 ఓట్లు రాగా, ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరి వంశ్ గెలిచినట్టు వెంకయ్య ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 222 మంది సభ్యులు సభకు హాజరవగా టీఆర్ఎస్, ఆప్, వైసీపీ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.