రామ్‌ హీరో ఆది విల‌న్‌

రామ్‌ హీరో ఆది విల‌న్‌

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని క‌థానాయ‌కుడిగా లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ‘ఉప్పెన‌’ ఫేమ్ కృతీ శెట్టి కథానాయిక‌గా కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టిని విలన్‌గా ఖరారు చేశారు. స‌రైనోడు త‌ర్వాత రెండోసారి పూర్తి స్థాయి విల‌న్ పాత్ర‌లో నటించే అవ‌కాశం ద‌క్కినందుకు ఆది పినిశెట్టి సంతోషం వ్య‌క్తం చేశాడు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ‘స‌రైనోడు త‌ర్వాత మ‌ళ్లీ విల‌న్‌గా చేయాలంటే పాత్ర‌లో ఏదైనా ప్ర‌త్యేక‌త ఉండాల‌నుకున్నాను. దర్శకుడు చెప్పిన కథ విన్నాక ఇది మామూలు రోల్‌ కాదనిపించింది. సాధారణంగా సినిమాల్లో విల‌న్ పాత్ర‌కు డీటెయిలింగ్ ఉండ‌దు. ఇందులో అది ఉంది. నాది క‌డ‌ప, క‌ర్నూల్‌కు చెందిన రా అండ్ ర‌స్టిక్ రోల్.. త‌మిళంలో మ‌ధురై బేస్‌లో ఉంటుంది. స‌రైనోడులో స్టైలిష్ విల‌న్‌గా చేశాక‌ ఇందులో మ‌ళ్లీ విల‌న్ పాత్ర ఇంట‌రెస్టింగ్ గా అనిపించింది.

ఓవైపు నా సినిమాలు నేను చేస్తూ డిఫ‌రెంట్ షేడ్‌ను ఇందులో చూపించ‌వ‌చ్చు. `యూట‌ర్న్` నిర్మాత‌ల‌తో నాకు ఇది రెండో సినిమా. రామ్ చేసిన సినిమాలన్నీ చూశాను తను చాలా ఎనర్జిటిక్ గా చేస్తుంటారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. లింగుస్వామి గారు విల‌న్ పాత్ర‌ను చాలా స్ట్రాంగ్ గా చూపించ‌నున్నారు. ఈ కార‌ణాల వ‌ల్లే ఈ సినిమా చేస్తున్నాను. ఇలాంటి అరుదైన అవ‌కాశాలు న‌టుడిగా న‌న్ను నేను విస్త‌రించ‌డానికి ఓ మంచి అవ‌కాశం అనుకుంటున్నాను. షూటింగ్ ఎప్పుడు మొదలువుతుందా అని ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి.