Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న ఆపరేషన్ గరుడ గురించి గత ఏడాది సెప్టెంబర్ లోనే అందరికన్నా ముందుగా తెలుసుకున్న హీరో, ప్రత్యేకహోదా ఉద్యమనేత శివాజీ ఇవాళ అత్యంత సంచలనకర విషయం బయటపెట్టారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై చేస్తున్న ఓ కుట్రను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతారాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను వాడుకునేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై చేసిన ఈ ఆపరేషన్ లో ఆపరేషన్ గరుడ భాగమన్నారు. తమిళనాడు, కేరళలో ఆ ఆపరేషన్ పేరు రావణ అని, కర్ణాటకలో కుమార అని తెలిపారు. గత ఏడాదే తనకు ఈ విషయం తెలిసిందని, తమకు అనుబంధంగా ఉన్న ఓ సంస్థకు సంబంధించిన కళ్యాణ్ జీ అనే వ్యక్తితో కలిసి ఓ జాతీయ పార్టీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందిందని వెల్లడించారు. ఆపరేషన్ వివరాలన్నీ ఓ పెన్ డ్రైవ్ లో పొందుపర్చానని, త్వరలోనే అందరికీ ఇస్తానని తెలిపారు.
ఒక జాతీయ పార్టీ, దానికి లక్ష్యంగా ఉన్న ప్రాంతీయ పార్టీ, పావుగా మరో వ్యక్తి… ఇలా ఆ ఆపరేషన్ క్రమం ఉంటుందని వివరించారు. ఈ ఆపరేషన్ల కోసం మొత్తం రూ. 4,800 కోట్ల రూపాయలు ఆ పార్టీ కేటాయించిందని, అందులో కొంతమొత్తం ఇప్పటికే బట్వాడా జరిగిపోయిందని తెలిపారు. ఈ ఆపరేషన్ కు సూత్రధారి ఒక రాజ్యాంగశక్తి అని, దీనిలోకి వచ్చే వాళ్లకు రావడం మాత్రమేగానీ, బయటకు వెళ్లడం తెలీదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయఅవకాశాలను వాడుకునేందుకు ఆ జాతీయ పార్టీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనైక్యతను వాళ్లు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్లు కాదని, సమయం వచ్చినప్పడు బుద్ధి చెబుతారని శివాజీ హెచ్చరించారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం రేపు అవిశ్వాసంపై చర్చకు సిద్ధపడతారని, ఓ పక్క ప్లాన్ ప్రకారం సభను నిర్వహించబోతున్నారని తెలిపారు.
కేంద్రప్రభుత్వం తరపున ఆరుగురు లోక్ సభలో మాట్లాడతారని, వారిలో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు తెలుగులో మాట్లాడతారని చెప్పారు. ఈ ఎంపీలంతా ఏపీకి అంతా చేసేశామని చెప్తారని తెలిపారు. మన ఎంపీలకు ఇంగ్లీషు పెద్దగా రాదనే భావన ఢిల్లీలో ఉందని తెలిపారు. ఆరుగురు ఎంపీలు మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని తెలిపారు. చివరికి అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు. ఆపరేషన్ ద్రవిడ గురించి వెల్లడించడంలో ప్రత్యేక హోదా సాధన సమితికిగానీ, ఏ రాజకీయపార్టీకిగానీ సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ వివరాలను నమ్మడంలో ఎవరి ఇష్టం వారిదన్నారు. ఏ రాజకీయపార్టీతోనూ తనకు అవసరం లేదని, తనకు అందరూ కావాలని, ఏపీ బాగోగుల కోసమే తాను పాటుపడుతున్నానని చెప్పారు.