మరో సర్జికల్ స్ట్రైక్…300 మంది టెర్రరిస్ట్ లు మృతి !

IAF's Hit And Destroyed Terrorist Camps Across The Line Of Control

పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృత‌నిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది. ఎల్వోసీ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలతో ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు రెండు వేల కిలోల పేలుడు పదార్థాలతో తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌ పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌లోని పంఖ్తుఖ్వా ప్రావిన్సుల్లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా సర్జికల్ దాడులు చేసింది. నియంత్రణ రేఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంపై మిరాజ్ 2000 విమానాలతో భారత వైమానిక దళం విరుచుకుపడింది. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాలకోట్, చకోటి, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన అల్ఫా-3 కంట్రోల్ రూమ్‌ లు ధ్వంసమయ్యాయని తెలిపాయి.

ఈ దాడులను ధ్రువీకరిస్తూ పాకిస్థాన్ సైన్యం ట్వీట్ చేసింది. భారత యుద్ధ విమానాలు పేలోడ్‌కు పాల్పడినట్టు ఫోటోలను పాక్ ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత 2016 సెప్టెంబరు 28న భారత్ సర్జికల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ముజఫరాబాద్ సెక్టార్ నుంచి చొచ్చుకొచ్చిందని, దీనిపై అప్రమత్తమైన తమ వైమానిక దళం భారత విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది. అయితే, అది త్రుటిలో తప్పించుకుందని, తాము ప్రయోగించిన బాంబు బాలాకోట్ సమీపంలో కూలింది. ఇందులో ఎవరూ గాయపడలేదు’ అంటూ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీకి సర్జికల్ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్లుప్లంగా వివరించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సర్జికల్ దాడుల్లో 300 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.