సరిహద్దులో ఏదో అవుతోంది…సరిహద్దు గ్రామాలకి బీఎస్ఎస్ కీలక ఆదేశాలు !

Tension At Pakistan Border

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో భారత్-పాక్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ సరిహద్దు గ్రామాలపై పాక్ దాడి చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్ రాత్రివేళ దీపాలు వెలిగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాణస్కంత జిల్లాలోని జలోయ, మావసారి, శివనగర్, మేఘపుర, రండోసాన్ గ్రామాల ప్రజలకు ఈ హెచ్చరికలు చేసింది. బీఎస్ఎఫ్ ఆదేశాలతో ఆయా గ్రామాలు రాత్రివేళ చిమ్మచీకటిలో గడుపుతున్నాయి. భద్రతా దళాల ఆదేశంతో గ్రామాల్లో విద్యుత్ దీపాలను ఆర్పివేసినట్టు రండోసాన్ గ్రామ సర్పంచ్ దిలీప్ సిన్హా చౌహాన్ తెలిపారు. గ్రామంలో లైట్లు వెలిగి ఉంటే పాక్ దళాలు దాడికి తెగబడే అవకాశం ఉందని సిన్హా పేర్కొన్నారు.

అలాగే, సరిహద్దుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే బీఎస్ఎఫ్‌కు సమాచారం ఇవ్వాలంటూ గ్రామాల్లోని గోడలపై బీఎస్ఎఫ్ హెల్ప్‌లైన్ నంబరును రాసింది. ఇలాంటి తరుణంలో మోదీ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) ఆదివారం రాత్రి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ సమావేశానికి హాజరయ్యారు. తమకు దొరికిన భారత పైలట్ అభినందన్‌ను ఇమ్రాన్ ప్రభుత్వం విడిచిపెట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాని ఎన్ఎస్‌సీ సమావేశం నిర్వహించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.