‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్కు ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుబ్రహ్మణ్య స్వామి కథల స్ఫూర్తితో రూపొందనున్న ఈ పౌరాణిక యాక్షన్ ఎపిక్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మేకర్స్ 2027 మార్చి తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించి, అదే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఇటీవల ఎదురైన భుజం గాయం నుంచి కోలుకుంటున్నాడు. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. పూర్తిగా కోలుకున్న తర్వాత తన ప్రస్తుత ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్ను తిరిగి ప్రారంభించనున్నాడు.
‘డ్రాగన్’ చిత్రీకరణ పూర్తయిన అనంతరం ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.






