టాలీవుడ్లో ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రణబాలి’ Ranabaali కూడా ఒకటి. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ పీరియాడిక్ చిత్రానికి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది.
తాజాగా ‘రణబాలి’ టీమ్ నుంచి కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవలే రష్మిక మందన్నా తనకు సంబంధించిన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కూడా మొత్తం షూటింగ్ పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఈ సందర్భంగా రాహుల్ తన చిత్ర బృందంతో కలిసి ఉన్న ఓ వీడియో క్లిప్ను షేర్ చేశారు. యూనిట్ సభ్యులందరితో కలిసి ‘రణబాలి’ డైలాగ్ను చెబుతూ షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేశారు. మొత్తం 130 రోజుల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్ను తన ‘ఆర్మీ’తో కలిసి పూర్తి చేసినట్లు దర్శకుడు పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ నేపథ్యంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్కు ప్రాధాన్యతనిస్తూ సినిమాను రూపొందించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. షూటింగ్ పూర్తవడంతో ఇక సినిమా ప్రమోషన్స్పై చిత్ర బృందం దృష్టి పెట్టే అవకాశం ఉంది.
‘రణబాలి’ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ అభిమానులు, మూవీ లవర్స్ ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




