సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రద్దు !

Samjhauta Express Canceller By Pakistan

సర్జికల్ దాడుల తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా పీవోకేలోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు చేసింది. దీంతో అసహనంగా రగిలిపోతున్న పాక్ సైన్యం భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిన్న మన సరిహద్దుల్లోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేగా భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కాడు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్థాన్ రద్దు చేసింది.

భారత్‌ కు నడిపే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ రైల్వేస్ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 1976లో భారత్-పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైంది. సంఝౌతా పదానికి ‘ఒప్పందం’ అనే అర్థం వస్తుంది. ఈ రైలులో ఆరు స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ 3టైర్ కోచ్ ఉంటుంది. వారానికి రెండు సార్లు ఆది, బుధవారాల్లో ఇది ప్రయాణిస్తుంది.