రద్దీ పెరిగింది… డీమార్ట్ పై వేటు పడింది

తెలంగాణలో రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అందులో భాగంగా తాజాగా ఎల్‌బీ నగర్‌ డీమార్ట్‌ను అధికారులు సీజ్‌ చేయాల్సి వచ్చింది. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ వేళ నిబంధనలు పాటించని ఎల్‌బీ నగర్‌ డీమార్ట్‌కు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు షాకిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను యాజమాన్యం పాటించకపోవడంతో.. అధికారులు సూపర్‌ మార్కెట్‌ను సీజ్‌ చేశారు.

కాగా అసలేం జరిగింది అంటే.. ఎల్‌బీ నగర్‌ ప్రాంతంలోని డీమార్ట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున వినియోగదారులు నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా కనిపించారు. వినియోగదారలు సూపర్‌ మార్కెట్‌లో భౌతిక దూరం పాటించేలా యాజమాన్యం కనీస చర్యలు తీసుకోలేదని… గ్రహించిన అధికారులు సదరు డీమార్ట్‌ను సీజ్‌ చేసి నోటీసులు అంటించారు.

డీమార్ట్‌లో కనీసం కస్టమర్ల కోసం శానిటైజర్స్‌ కూడా యాజమాన్యం ఏర్పాటు చేయలేదని వివరించారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. షరతులతో సూపర్‌ మార్కెట్స్‌కు నిత్యావసరాల విక్రయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.