కారు రిపేర్.. సైకిల్ పై డ్యూటీకెళ్లిన డాక్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి

ప్రపంచమంతా కరోనా బారిన పడి అల్లల్లాడిపోతుంది. దేశమంతా తిరిగి మలిదశ లాక్ డౌన్ లో నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో డాక్టర్ కు ఘోరం జరిగింది. కారు రిపేర్ కావడంతో అది అలాగే వదిలేసి సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లాడు డాక్టర్. దీంతో ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది.

అయితే డాక్టర్‌ కారు రిపేరు రావడంతో మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో చేసేది లేక ఇంట్లోని సైకిల్ బయటకు తీసి దానిపై ఆస్పత్రికెళ్లాడు. విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో సైకిల్‌పై నుంచి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు వైద్యుడు. ఈ విషాద ఘటన ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో జరిగింది. కాగా ఢిల్లీకి చెందిన డాక్టర్ జేపీ యాదవ్ సాకేత్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లి విధులకు హాజరైన యాదవ్ ఇంటికి తిరిగి వస్తూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.

కాగా ఆయన సైకిల్‌పై వస్తుండగా మాలవీయ నగర్ సిగ్నల్ వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో జేపీ యాదవ్ సైకిల్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఆ వెనకనే కారులో వస్తున్న తోటి వైద్యులు వెంటనే స్పందించి ఆయనను సాకేత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యాదవ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అతివేగంగా వచ్చి ప్రమాదానికి కారణమైన కారును డ్రైవర్ ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి సిగ్నల్ వద్దనున్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.