రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా ఎట్టకేలకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తిరిగి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా కామెంటేటర్‌గా కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడైన రైనా.. గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

అయితే, సీఎస్‌కే అతడిని రిటైన్‌ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్‌-2022లో రూ.2 కోట్ల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఏ జట్టు కూడా రైనా పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. కనీసం వివిధ కారణాల వల్ల జట్లకు దూరమైన ఆటగాళ్ల స్థానంలోనైనా ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

ఈ నేపథ్యంలో క్రికెట్‌ కామెంటేటర్‌గా అవతారం ఎత్తేందుకు రైనా సిద్దమైనట్లు ఐపీఎల్‌ వర్గాల సమాచారం. ఇక రైనాతో పాటు టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘ఈసారి రైనా ఐపీఎల్‌లో భాగం కావడం లేదని అందరికీ తెలుసు. అయితే, మేము అతడిని తిరిగి లీగ్‌లో చూడాలనుకుంటున్నాం. రైనాకు అభిమానులు ఎక్కువ. ముద్దుగా తనని మిస్టర్‌ ఐపీఎల్‌ అని పిలుచుకుంటారు.

అతడు తిరిగి వస్తే బాగుంటుంది. ఇక శాస్త్రి ఒకప్పుడు స్టార్‌ స్పోర్ట్స్‌ ఇంగ్లింష్‌ కామెంటరీ టీమ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐపీఎల్‌ వ్యాఖ్యాతలుగా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం’’ అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపినట్లు జాగరన్‌ మీడియా పేర్కొంది. కాగా రైనా, రవిశాస్త్రి ఐపీఎల్‌ హిందీ కామెంటేటర్లుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేశ్‌ రైనా గతంలో గుజరాత్‌ లయన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.