డార్లింగ్ కి జాన్ టైటిలే ఫిక్స్

డార్లింగ్ కి జాన్ టైటిలే ఫిక్స్

సాహో సినిమాతో మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటిన యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. సాహో రిలీజ్‌ తరువాత ప్రస్తుతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్న డార్లింగ్‌ త్వరలోనే తదుపరి చిత్రాన్ని తిరిగి ప్రారంభించనున్నాడు. సాహో సెట్స్‌ మీద ఉండగానే జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు ప్రభాస్‌.

పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 20 శాతానికి పైగా పూర్తయ్యింది. త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను కూడా సాహో తరహాలోనే తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇన్నాళ్లు ఈ సినిమాకు జాన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌ను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఎప్పుడూ ఖండించలేదు. దీంతో సినిమాకు జాన్ టైటిల్‌లే ఫిక్స్ అని భావించారు ఫ్యాన్స్‌.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మరో టైటిల్‌ను నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాహో తరువాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై కూడా జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్‌ పెదనాన్న కృష్ణం రాజు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ ఇటలీకి సంబంధించిన భారీ సెట్స్‌ను రూపొందించారు. త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించి 2020 ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.