వైసీపీలోకి జయసుధ…బాబుకి షాకేముంది ?

Jayasudha Join To YSRCP

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షపార్టీ వైసీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఒకవైపు కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్ సినీ గ్లామర్‌ ను కూడా పార్టీకి ఉపయోగించుకునేందుకు ప్రయత్నా చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, సుమంత్, మంచు విష్ణు, మోహన్ బాబు, తదితరులు జగన్‌ కి టచ్‌ లోకి వెళ్ళగా టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ అయితే వైసీపీ కండువా కప్పుకుని కీలకపదవి చేపట్టి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక పోసాని, భాను చందర్, విజయ్ చందర్‌ తదితరులు వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. తాజాగా సీనియర్ నటి జయసుధ వైసీపీ పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆమె కొద్ది సేపటి క్రితం లోటస్ పాండ్ లో భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. వైఎస్ బతికుండగా 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన జయసుధ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీ పార్టీలో చేరారు. అయినా ఆమె క్రియాశీలకంగా వ్యవహరించలేదు. దీంతో ఇప్పుడు ఆమె పార్టీ మారినా బాబుకి వచ్చిన నష్టం ఏమీ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్న్నాయి. అయితే ఇప్పుడు ఆమె ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఆమెని తన సహ నటుడు మురళీమోహన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జయసుధను టీడీపీలో జాయిన్ చేయించారనే ప్రచారం అప్పట్లో నడిచింది. అయితే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీమోహన్ ఈసారి ఎన్నికలకు దూరం కావడంతో జయసుధ కూడా పార్టీని వీడుతున్నారా? లేక పార్టీలో సరైన గుర్తుంపు లేకపోవడంతో కండువా మారుస్తున్నారా అన్నది తేలాల్సిఉంది.