YS Jagan Mudragada Padmanabham అంత్యక్రియల్లో పాల్గొని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడికి చేరుకున్న జగన్ ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి చివరి వీడ్కోలు పలికారు.
హెలికాప్టర్లో జగ్గంపేటకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్లారు. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

YS Jagan Mudragada Padmanabham: పాడె మోసిన మాజీ సీఎం
ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ముద్రగడ పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. జగన్ స్వయంగా అంతిమయాత్రలో పాల్గొన్న దృశ్యాలు రాజకీయ వర్గాల్లోనూ, ముద్రగడ అభిమానుల్లోనూ చర్చగా మారాయి.
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు హాజరై ముద్రగడ పద్మనాభానికి తుది వీడ్కోలు పలికారు.
అంతకుముందు భీమవరం పర్యటనలో వైఎస్ జగన్ ఆక్వా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన అనంతరం ఆయన కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.






